నూనె, నెయ్యి, పన్నీరు, మసాలాల నుంచి పసిపిల్లలు తాగే పాల వరకు ప్రతి ఆహార పదార్థం కల్తీమయం అవుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు కేటుగాళ్లు రసాయనాలు కలిపిన పాలను విక్రయిస్తూ నగర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ మహానగరానికి అసలు వచ్చే పాల కన్నా, విక్రయిస్తున్న పాల పరిమాణం రెట్టింపు ఉండటం గమనార్హం. ఈ విషతుల్యమైన పాలు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుంచి తగినంత నిఘా లేకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
నగరంలో రోజువారీగా లక్షలాది లీటర్ల పాల అవసరం ఉంది. అయితే, ఆ స్థాయిలో సహజంగా పాలు లభించడం సాధ్యం కాకపోయినా, మార్కెట్లో మాత్రం వేలాది లీటర్ల పాలు విరివిగా సరఫరా అవుతున్నాయి. శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పాలను పరీక్షించేవారే కరువయ్యారు. ఎలాంటి నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండానే వినియోగదారులకు వీటిని అంటగడుతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో పశువుల పెంపకం దారులు పాల ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.
పశువైద్యుల సూచనలు లేకుండా ఇస్తున్న ఈ ఇంజెక్షన్ల వల్ల మూగజీవాల ఆరోగ్యంతో పాటు, ఆ పాలు తాగే చిన్నారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. కొన్ని చోట్ల పాల వ్యాపారులు మరింత లాభం కోసం ప్యాకెట్లలోని పాలను వేరుచేసి, వాటికి రసాయనాలు, యూరియా, సర్ఫ్ వంటి హానికరమైన పదార్థాలను కలుపుతూ చిక్కటి పాలుగా విక్రయిస్తున్నారు.
ఈ రసాయన పాలు తాగిన ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవుతున్నారు. నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ కల్తీ దందాను అరికట్టాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని నగర వాసులు తీవ్రంగా కోరుతున్నారు. ఏది అసలు పాలో, ఏది కల్తీ పాలో సాధారణ వినియోగదారుడు గుర్తించడం కష్టమని, అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.