1 వీక్షణలు

ఏపీ రాజకీయాల్లోకి మెగాస్టార్ రీఎంట్రీ.. కూటమి సర్కార్ నుంచి చిరంజీవికి బిగ్ ఆఫర్!

ఏపీ రాజకీయాల్లోకి మెగాస్టార్ రీఎంట్రీ.. కూటమి సర్కార్ నుంచి చిరంజీవికి బిగ్ ఆఫర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి 'మెగా' గాలి వీస్తోంది. టాలీవుడ్ అగ్రనాయకుడు, మెగాస్టార్ చిరంజీవికి ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మెగాస్టార్ ప్రత్యేకంగా భేటీ కావడం ఈ ఊహాగాగాలకు మరింత బలం చేకూర్చింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా చిరంజీవిని నిలపాలని సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో చర్చించిన తర్వాతే ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి బహిరంగంగానే తమ కుటుంబం తరఫున మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలోనూ చిరంజీవికి అత్యున్నత ప్రాధాన్యం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెగా సోదరులను ఎంతో ఆప్యాయంగా పలకరించడం అప్పట్లో విశేషంగా నిలిచింది. అప్పట్నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చిరంజీవి సానుకూలంగా స్పందిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనకున్న అపారమైన ప్రజాదరణను రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమ పథకాల ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి.. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఏపీలో తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాల్సిందిగా చంద్రబాబు ఆయనను కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

 గతంలో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కింగ్ నాగార్జున ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరించిన విధంగానే, ఇప్పుడు కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అట్టడుగు వర్గాలకు బలంగా తీసుకెళ్లడంలో చిరంజీవి కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా తన ముందుంచిన ఈ ప్రతిపాదనపై మెగాస్టార్ చిరంజీవి కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.

 అయితే, ప్రస్తుతం ఉన్న సినిమా షూటింగ్ కమిట్‌మెంట్లు, వ్యక్తిగత బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కోరినట్లు సమాచారం. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే మాత్రం ఇది ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారనుంది.

ఈ కథనాన్ని షేర్ చేయండి: