ప్రిన్స్ 50వ పుట్టినరోజు వేడుకలు: 50 ఏళ్ల వయసులోనూ ఆకర్షణీయమైన లుక్ విశేషాలు
✨ ఆర్టికల్ సారాంశం
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ, ఏటా మరింత హ్యాండ్సమ్గా మారిపోతున్న టాలీవుడ్ ‘ప్రిన్స్’ మహేశ్ బాబు నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. తనదైన గ్లామర్, అభినయంతో క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఒక మెస్మరైజ్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన గతంలో పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు, వ్యక్తిగత మరియు వృత్తిగత విశేషాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి
. తన బాల్యం గురించి చెబుతూ.. చిన్నప్పుడు అందరి పిల్లలాగే సాదాసీదాగా పెరిగినట్లు మహేశ్ బాబు గతంలో గుర్తుచేసుకున్నారు. చెన్నైలో తాను బాలనటుడిగా సినిమాలు చేశాననే విషయం చాలామందికి తెలియదని, అలా తెలియకపోవడం వల్గనే అందరిలా సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం దక్కిందని తెలిపారు. తనకు కోపం చాలా తక్కువని, ఒకవేళ వచ్చినా కేవలం ఐదు నిమిషాల్లోనే తగ్గిపోతుందని నవ్వుతూ చెబుతుంటారు.
ఇక తనకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టమని, ఫేవరెట్ హాలిడే స్పాట్ దుబాయ్ అని పేర్కొన్నారు. కుటుంబ జీవితంపై స్పందిస్తూ.. ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలమని మహేశ్ ప్రగాఢంగా నమ్ముతారు. ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతున్నానని, ఇంటి బాధ్యతలన్నీ తన భార్య నమ్రత ఎంతో చక్కగా చూసుకుంటుందని చెబుతారు.
తమ ప్రేమ వివాహానికి పెద్దలను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టిందని, నమ్రత లేకపోతే తాను లేనని ఆమెపై తన ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ఇక పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. తన కుమారుడు గౌతమ్కు సినిమాలపై ఆసక్తి ఉందని, అయితే ఇండస్ట్రీకి రావాలా వద్దా అనేది పూర్తిగా తన ఇష్టమని అన్నారు. కూతురు సితారను సైంటిస్ట్ చేయాలని ఉందని, కానీ పెద్దయ్యాక ఆమె ఏ రంగం ఎంచుకున్నా తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. షూటింగ్ లేని సమయంలో పూర్తిగా కుటుంబంతోనే గడపడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదని, ఎంత మంచి సినిమాలు చేశామన్నదే ముఖ్యమని మహేశ్ భావిస్తారు. రూ.వందల కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తున్నప్పుడు కథలో కొత్తదనం ఉండాలని, లేదంటే బయ్యర్లు నష్టపోతారని వ్యాఖ్యానించారు. మంచి కథ కుదిరితే భవిష్యత్తులో ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
తన కెరీర్లో ‘మురారి’ టర్నింగ్ పాయింట్ అయితే, ‘ఒక్కడు’ స్టార్డమ్ తెచ్చిపెట్టిందని, ‘పోకిరి’ ఆ స్థాయిని మరింత పెంచిందని గుర్తుచేసుకున్నారు. అలాగే ‘దూకుడు’ తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తే, ‘శ్రీమంతుడు’ వ్యక్తిగతంగా ఎంతో ముఖ్యమైన చిత్రమని పేర్కొన్నారు. నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న మహేశ్ బాబుకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.