ప్రసవానంతరం బరువు పెరిగిన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ను స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. 'బిగ్ బాస్-20'లోని ఓ ఎపిసోడ్లో ఆయన ఈ విషయంపై స్పందిస్తూ, ఇతరులను కించపరిచే ట్రోలర్స్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'గర్భం దాల్చిన తర్వాత బరువు పెరగడం అనేది ఎవరికైనా చాలా సహజం. ఒక మహిళను బరువు గురించి ట్రోల్ చేయడం సరికాదు. కత్రినా ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడపాలనుకుంటోంది. ఆమె మళ్లీ షూటింగ్స్లో పాల్గొనే సమయానికి కచ్చితంగా మునుపటి ఆకృతిలోకి వస్తుంది.
ఇలాంటి ట్రోల్స్ను ఆమె అస్సలు పట్టించుకోకూడదు' అని సల్మాన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'సోషల్ మీడియా ద్వారా నేడు చాలా మంది ఉపాధి పొందుతున్నారు. కానీ, కొందరు మాత్రం ఇతరులను కించపరుస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ల నిజమైన ముఖాలు, గుర్తింపును బయటపెట్టుకోలేరు కానీ.. ఎదుటివారి వయసు, బరువు, అందంపై విమర్శలు చేస్తారు.
ఇతరుల వైఫల్యాలను చూసి ఆనందించే వారు చాలా మందే ఉన్నారు. నన్ను కూడా ముసలోడిని అయిపోయానని ట్రోల్ చేస్తుంటారు. అవును.. నాకు 60 ఏళ్లు. నేను ఎప్పటికీ ‘మైనే ప్యార్ కియా’ నాటి కుర్రాడిలాగే కనిపించలేను కదా? వయసు పెరగడం అనేది చాలా సాధారణ విషయం. కానీ, దాన్నేదో పెద్ద నేరంలా చూస్తూ విమర్శించడం సరికాదు' అని సల్మాన్ పేర్కొన్నారు.
ఇదే ఎపిసోడ్కు సంబంధించిన మరో ప్రోమో అభిమానులను ఆందోళనకు గురిచేసింది. వేదికపై మాట్లాడుతున్న సల్మాన్.. అకస్మాత్తుగా ఛాతీ పట్టుకుని కుప్పకూలిపోయారు. అయితే, అదంతా కేవలం ఓ కంటెస్టెంట్కు బుద్ధి చెప్పేందుకు చేసిన ప్రాంక్ మాత్రమేనని సల్మాన్ సోషల్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. హౌస్లో ఉన్న ఓ కంటెస్టెంట్.. తనకు అనారోగ్యంగా ఉందని, ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ ఉందని మిగతావారితో అబద్ధం చెప్పారు.
ఆరోగ్యపరమైన విషయాలతో సరదాగా ఆడుకుంటే ఎదుటివారు ఎంతలా కంగారు పడతారో అతడికి ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చెప్పడానికే సల్మాన్ ఇలా చేశారని తెలిసింది. కాబట్టి అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సల్మాన్ స్పష్టం చేశారు.