3 వీక్షణలు

దిల్లీ ఆందోళనకారులకు పోలీసుల బిగ్‌ షాక్‌.. పాస్‌పోర్టులు రద్దు చేసేందుకు సన్నాహాలు!

దిల్లీలో 'నీట్' పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దిల్లీ పోలీసులు నిందితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. 'చలో పార్లమెంట్' నిరసనల్లో పాల్గొని హింసకు పాల్పడిన వారిని గుర్తించి, వారి పాస్‌పోర్టులను రద్దు చేసే దిశగా పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన 'చలో పార్లమెంట్' కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ పరిసరాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆందోళనకారులు ధ్వంసం చేసేందుకు యత్నించడంతో పరిస్థితి చేయిదాటిపోయింది.

రక్షణగా ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో పలువురు నిరసనకారులతో పాటు భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దిల్లీ పోలీస్ విభాగం, నిరసనల్లో పాల్గొన్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించింది.

 సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి, వారి పాస్‌పోర్టులను రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పోలీసుల ఈ నిర్ణయం అమలైతే నిందితుల విదేశీ ప్రయాణాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు పలకడంతో దేశరాజధానితో పాటు పలు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ కథనాన్ని షేర్ చేయండి: