4 వీక్షణలు

షాబాద్ హత్యలు: హత్యలకు ముందు సెల్ఫీ వీడియోలో హంతకుడి సంచలన ఆరోపణలు

షాబాద్ హత్యలు: హత్యలకు ముందు సెల్ఫీ వీడియోలో హంతకుడి సంచలన ఆరోపణలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ వరుస హత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడగా, అతని మృతదేహం వద్ద లభించిన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో బయటపడింది. హత్యలకు ముందు రాజ్‌కుమార్ చిత్రీకరించిన ఈ వీడియోలో, తాను హత్యలు చేయడానికి గల కారణాలను వివరిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, పెంజర్ల గ్రామ శివార్లలోని ఓ వెంచర్ వద్ద రాజ్‌కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

 మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బాతో పాటు సెల్‌ఫోన్ లభ్యం కావడంతో అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, అందులో రాజ్‌కుమార్ చిత్రీకరించిన సెల్ఫీ వీడియో బయటపడింది. హత్యలకు ఒకరోజు ముందు, అంటే జూలై 10వ తేదీ సాయంత్రం 4:55 గంటలకు ఈ వీడియోను రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో రాజ్‌కుమార్, తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక కుటుంబాన్ని తీవ్రంగా ఆరోపించాడు. "ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. వారి కోసం ఎంతో ఖర్చు చేశాను.

 డబ్బు మొత్తం ఇచ్చేసి అప్పుల పాలయ్యాను. నా పిల్లలకు కూడా భూమి లేకుండా పోయింది. నాపై తప్పుడు కేసు పెట్టి నన్ను మోసం చేశారు. అందుకే ఆ అమ్మాయి కుటుంబాన్ని చంపాలని అనుకున్నాను" అని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, అప్పుల కారణంగా జీవితంపై విరక్తి చెందానని కూడా వీడియోలో వెల్లడించాడు. తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేశారని, ముఖ్యంగా బాలిక కుటుంబం తనను ఆర్థికంగా నిండా ముంచిందని రాజ్‌కుమార్ ఆరోపించాడు. తన సంపాదనలో సగం వారికే ఇచ్చానని, వారి వల్ల అప్పులపాలై ఆస్తులు కోల్పోయానని, పిల్లల భవిష్యత్తు నాశనమైందని వాపోయాడు.

 ఈ ద్రోహానికి ప్రతీకారంగానే హత్యలకు పాల్పడినట్లు వీడియోలో స్పష్టం చేశాడు. పోక్సో కేసులో ఇటీవల బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్, జూలై 10న అర్ధరాత్రి దారుణానికి ఒడిగట్టాడు. తనపై పోక్సో కేసు పెట్టిన 17 ఏళ్ల బాలికను, ఆమె తల్లిని, నాయనమ్మను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన భార్య సరితను, కుమారులు పరీక్షిత్, దైవీక్షిత్‌లను కూడా గొంతు కోసి చంపాడు. తన జల్సాలకు అడ్డు వస్తోందని, విడాకులు కోరిందని భార్య సరితను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాజ్‌కుమార్‌కు విచ్చలవిడి జీవితం, జల్సాలకు అలవాటు పడినట్లు, నేర చరిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై రెండు కేసులు ఉన్నాయని, అందులో ఒకటి పోక్సో కేసు అని తేలింది.

బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాతే ఈ హత్యల పథకం రచించినట్లు తెలుస్తోంది. వరుస హత్యల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిందితుడి ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాజ్‌కుమార్‌ను పట్టిచ్చిన వారికి రూ.2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అయితే, చివరకు రాజ్‌కుమార్ తన మేనమామ ఊరిలో మృతి చెంది ఉండటంతో ఈ కేసు విషాదంగా ముగిసింది.

ఈ కథనాన్ని షేర్ చేయండి: