గోవింద్ మానసిక స్థితిపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు
✨ ఆర్టికల్ సారాంశం
బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందాపై ఆయన భార్య సునీతా ఆహుజా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న చందంగా గోవిందా మతి చెడి ప్రవర్తిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కోమల్ రాణి స్వర్ణకార్ అనే నూతన నటితో గోవిందా సన్నిహితంగా మెలుగుతున్నట్లు వస్తున్న వార్తలు, తాజాగా ఎయిర్పోర్టులో ఇద్దరూ కలసి కనిపించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
గత కొంతకాలంగా గోవిందా, సునీతల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలోనూ గోవిందా ఇతర నటీమణులతో సంబంధాలు పెట్టుకున్నారంటూ సునీత బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తాజాగా ఎయిర్పోర్టులో గోవిందా, కోమల్ రాణి జంటగా ప్రయాణిస్తున్న వీడియో వైరల్ కావడంపై ఆమె స్పందిస్తూ.. తాను ఇంతకాలం చెప్పిన నిజాలను అప్పట్లో ట్రోల్ చేసిన అభిమానులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఈ వివాదంపై ఇకమీదట తనను ఎలాంటి ప్రశ్నలు అడగవద్దని, దీనిపై మాట్లాడేందుకు తనకు ఎలాంటి ఆసక్తి లేదని సునీత స్పష్టం చేశారు. మరోవైపు, సునీత గతంలో తనపై చేసిన వ్యాఖ్యలపై ఇటీవల గోవిందా స్పందిస్తూ తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఆమె తనపై ఉన్న అపారమైన ప్రేమతోనే తిడుతుంటానని, ఆ తిట్లను కూడా తాను ప్రేమగానే భావిస్తానని తెలిపారు.
తాను జీవితంలో ఈ స్థాయికి చేరుకోవడానికి సునీత పడిన శ్రమ ఎంతో ఉందని, పిల్లలను ఆమె ఎంతో ప్రేమగా పెంచారని కొనియాడారు. ‘కూలీ నెం:1’, ‘హీరో నెం:1’, ‘రాజాబాబు’, ‘పార్టనర్’ లాంటి అనేక సూపర్హిట్ చిత్రాలతో తనదైన నటన, అద్భుతమైన డ్యాన్స్, కామెడీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గోవిందా వ్యక్తిగత జీవితం ప్రస్తుతం ఇలా నిత్యం వార్తల్లో నిలవడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.