8 వీక్షణలు

గానకోకిల ఎస్. జానకి కన్నుమూత: 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస

గానకోకిల ఎస్. జానకి కన్నుమూత: 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస

ప్రముఖ గాయని, 'దక్షిణ భారత గానకోకిల' బిరుదాంకితురాలు ఎస్. జానకి (88) కన్నుమూశారు. మైసూరులోని ఓ ఆసుపత్రిలో వయోధిక సమస్యలతో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తను మనవరాలు అప్సర విద్యుల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ధ్రువీకరించారు.

1938 ఏప్రిల్‌ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకి, తెలుగు చలన చిత్రసీమకు ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో కలిపి దాదాపు 50 వేలకు పైగా పాటలను ఆలపించి, సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

 ఆమె గాన మాధుర్యానికి గుర్తింపుగా నాలుగు జాతీయ అవార్డులు సహా, పలు ప్రతిష్ఠాత్మక సినీ అవార్డులు వరించాయి. భారత ప్రభుత్వం 2013లో ఆమెను పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మొదలుకొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వరకు ఎంతో మంది దిగ్గజ గాయనీ గాయకులతో కలిసి ఎస్. జానకి అద్భుత గీతాలతో శ్రోతలను అలరించారు.

ఎస్. జానకి మరణంపై ఆమె మనవరాలు అప్సర విద్యుల స్పందిస్తూ.. ‘‘మా ప్రియమైన అమ్మమ్మ, దిగ్గజ గాయని ఎస్. జానకి కన్నుమూశారన్న వార్త తెలియజేయడానికి ఎంతో విచారిస్తున్నా. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయత మధ్య ప్రశాంతంగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె అద్భుతమైన జీవితాన్ని గడిపారు. తన గానంతో లక్షల మందికి ఆనందం పంచారు. ఆమె ఒక దిగ్గజ గాయని. ఆమె పాటలు మధుర జ్ఞాపకాలు.

ఈ దుఃఖ సమయంలో మా కుటుంబ ఏకాంతతను గౌరవించాల్సిందిగా అందరినీ కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. ఎస్. జానకి మృతితో సంగీత లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె అందించిన మధుర గీతాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కథనాన్ని షేర్ చేయండి: